“యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్’” అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
ఇప్పుడు చాలా మంది సామాన్యులు ,సెలబ్రెటీలు హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు. సాదారణంగా హనుమాన్ మండలదీక్షను హనుమద్వ్రతమ్ లేదా హనుమజ్జయంతి నాటి పర్వదినములలో స్వీకరిస్తారు. హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండలదీక్ష ను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్తారు.
రీసెంట్ గా ఎన్టీఆర్..హనుమాన్ దీక్ష తీసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత ఆయన హనుమాన్ దీక్షలోకి వెళ్లిపోయారు. దాంతో ఆయన అభిమానులు కూడా చాలా మంది హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హనుమాన్ దీక్ష తీసుకోవాలంటే పాటించాల్సిన విధానం ఏమిటి..నియమ నిభంధనలు ఏమిటో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖమాసంలో కృష్ణ పక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తారు. “కలౌ కపి వినాయకౌ”అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.
దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్ష ను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేని ప్రాతఃకాల ప్రార్థన చెసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బిక్ష చేస్తారు.
సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట. పూజను నిర్వహించాలి. అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి . దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు.
హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్ జీ’ అని పలుకరించి రామనామ స్మరణం చేయటం, దీని ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం.
అంతేకాక రోగనివారణకు, శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపదుతుందని చెప్తారు.