ధర్మరాజు ఒకరోజు ‘నిర్జల ఏకాదశి’ గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు.. ‘జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ’ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు ‘మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు.
కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వత్రంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని ‘ కోరుతాడు.
వ్యాసులవారు ‘ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది.
ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ‘ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు’ అని తెలియజేశాడు.
హిందువులు జరుపుకునే విశేషమైన పండగలలో ‘నిర్జల ఏకాదశి’ ఒకటి. మొత్త 26 ఏకాదిశులు ఏడాదిలో వస్తుంటాయి. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నింటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. ఈ సంవత్సరం 2020 జూన్ 02 న ఈ ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండి వ్రత మాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉన్నటువంటి పుణ్య ఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది అని చెప్తూంటారు. ఏటా జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఈ నిర్జల ఏకాదశి జరుపుకుంటారు.
ఈ పర్వదినాన నీటిని తాగడం పూర్తిగా మానివేస్తారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? అన్ని ఏకాదశి ఉపవాసాల మాదిరి గానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది. దశమి నాడు ఒంటిపూట భోజనం చేస్తూంటాం.
ఆ తర్వాత నిర్జల ఏకాదశినాడు ఆచమనానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగిస్తాము. ఏకాదశినాడు విష్ణుమూర్తిని దర్శించి, సేవించి,పూజించుకోవడం చేస్తాము.
అలాగే ఏకాదశి రాత్రివేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయడం చేస్తూంటారు. ఇక ఉపవాశ విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మాణులును పిలిచి స్వయంపాక దానం ఇస్తారు. అలాగే ఒక అతిథిని భోక్తగా పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం చేస్తారు. శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
ఇక ‘నిర్జల ఏకాదశి’ రోజు…. సూర్యభగవానుడికి జలం సమర్పించిన అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షతలు, చందనంతో పూజ చేస్తూంటారు. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడుపుతారు. ఆ తర్వాత ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ స్వామి వారికి హారతి ఇస్తారు. శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవాలి. స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరకు అందించాలి. మొత్తం ఉపవాసం అయిన తర్వాత మాత్రమే మీరు నీటిని తాగాలి.
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥
శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి